కృష్ణాజిల్లా గన్నవరంలో పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితే గన్నవరం ప్రాంత ప్రజల మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీ అన్నారు. గన్నవరం ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా మంచినీటి సమస్యతో బాధపడుతున్నారు. స్థానికంగా రిజర్వాయర్ లేకపోవడంతో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించవలసిందిగా అనేక మంది ప్రజాప్రతినిధులను వారు కలిసి విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారి సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్య గుర్తించిన శాసనసభ్యులు వల్లభనేని వంశీ పానకాల చెరువు రిజర్వాయర్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. పానకాల చెరువు రిజర్వాయర్ ద్వారా గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుంది అని సందర్భంగా వంశీ ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువు పూడిక తీసిన మట్టిని గన్నవరం నియోజకవర్గంలోని జగనన్న లేఔట్ లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం అని తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా సెంటు భూమిని ప్రభుత్వం కేటాయిస్తే హర్షించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ స్థలాలను స్మశానంగా పోల్చటం సిగ్గుచేటని పార్టీలకతీతంగా అభివృద్ధిని అభినందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వంశీ పేర్కొన్నారు.