జంగారెడ్డిగూడెం: గంజాయి విక్రయిదారులతో పాటుగా దానిని వినియోగిస్తున్న ఒక ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు అదుపులోకి చేశారు. వారి వద్ద నుంచి ఒక లక్ష 41 వేల 500 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పి ధనుంజయుడు వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా చుట్టు పక్క ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు గంజాయి విక్రయించడంతో పాటుగా వినియోగిస్తున్నారని సమాచారం అందిందన్నారు. దీనితో మార్కండేయపురంలోని ఖాళీ ప్రదేశంలో దాడి చేసి పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
వీరి వద్ద నుంచి 28.3 కేజీల గంజాయిని, ఏడు మొబైల్ ఫోన్లను , 2500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో కొంత మంది విద్యార్థులు కూడా ఉన్నారని వివరించారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన హరీష్ అనే వ్యక్తి చింతూరు నుంచి బట్టు అనే వ్యక్తి సహాయంతో గంజాయిని జంగారెడ్డిగూడెంకు తీసుకువచ్చి విక్రయిస్తున్నాడని డిఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం సీఐ – పి రాజేష్ , ఇన్చార్జి ఎస్సై – ఎం జయ బాబు , ఏఎస్ఐ – ఎన్వి సంపత్ కుమార్ , కానిస్టేబుల్ సత్యనారాయణతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.