- క్యాంటీన్ యజమాన్యం నిర్వాకం
- భయాందోళనలో ఉద్యోగులు
- కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కుషాయిగూడ: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) క్యాంటీన్ భోజనంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ లో వండిన ఆహార పదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎంకి సరఫరా చేస్తారు. రోజులాగే శుక్రవారం మధ్యాహ్నం సరఫరా అయిన ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించారు. ఉద్యోగి బాబు భోజనం చేస్తుండగా పప్పులో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. కంగారు పడిన బాబు తోటి ఉద్యోగులకు, క్యాంటీన్ సిబ్బందికి తెలియజేశాడు. భయాందోళనతో తిన్న అన్నాని కక్కేశాడు. దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం బయటికి రాకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడ్డారు. అప్పటికే భోజనాలు చేసిన కొంతమంది ఉద్యోగులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఆహారపదార్థాలలో పురుగులు ఇతర క్రిమికీటకాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయని వాపోయారు. భోజనంలో పాము వస్తే యాజమాన్యం ఉద్యోగులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత లేదా? అని కొంతమంది ప్రశ్నించారు. ఫుడ్ పాయిజన్ అయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. వేల మంది ఉద్యోగులకు భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ లో ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం కేసు నమోదు చేయాలని, పూర్తిస్థాయి విచారణ చేయించాలని కోరారు. ఈసీఐఎల్ ఉన్నతాధికారులను వివరణ కోరగా, సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.