ముఖ్యమంత్రి గొంతులో భయం…
KCR threw down the Communist Party like curry leaves TPCC President Revanth Reddy
ఓటమి స్పష్టంగా కనిపించింది
రెండు నియోజకవర్గాల్లో పోటీ అంటే తన ఓటమిని ఒప్పుకున్నట్లే
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి అవమానించారు
కమ్యూనిస్టు పార్టీని కేసీఆర్ కరివేపాకులా పడేశారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ సవాల్ను స్వీకరించకుండా సీఎం కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గొంతులో భయం, ఓటమి స్పష్టంగా కనిపించిందన్నారు. మొత్తం సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవడం..అలాగే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడమే దీనికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తన సవాల్ను స్వీకరించకుండా కేసీఆర్ సిట్టింగుల స్థానాలు మార్చారన్నారు. సోమవారం గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లిస్ట్ చూస్తే వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు రేవంత్ రెడ్డి. 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందన్నారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే ఆయన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లే అని ఆయన వ్యాఖ్యానిచారు. రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే.. ఆయన గొంతులో భయం మొదలైందన్నారు. కేసీఆర్ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడిస్తారు. కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.
సిరిసిల్ల ఉంది..కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం…మైనారిటీలను అవమానించడమే ఈ విషయాన్ని మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎనలేని సేవ చేశారని..కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటకు వెళ్లకుండా కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఓటమి సూర్యాపేట సభలో స్పష్టంగా కనిపించిందన్నారు. 12.03 గంటలకు బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తంలో లిక్కర్ షాప్స్ డ్రా తీశారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివి తేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి కేసీఆర్ రూ. 11 వేల కోట్లు మిగుల్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక్క రూపాయి అని అందరు అనుకుంటున్నారు కానీ దాని వల్ల వేలాది మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో పాటు ప్రభుత్వానికి రూ. 11 వేల కోట్లు మిగిలాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే పూర్తి రుణమాఫీ జరిగిందన్నారు. రూ. 75 రూపాయలున్న పించన్ను రూ. 200 లకు పెంచింది కాంగ్రెస్సేనన్నారు రేవంత్ రెడ్డి.
అడగడానికి సీఎం కేసీఆర్కు సిగ్గు ఉండాలని, కేసీఆర్కు రెండు అవకాశాలు ఇస్తే ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నారు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా? 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు…ఆ గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? నీ చింతమడకలో బడి కట్టింది.. నీ ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్..ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది.
కాంగ్రెస్..జనసాంద్రత ఉన్న జూబ్లీ బస్ స్టేషన్, కాచిగూడ, గౌలీగూడా లాంటి చోట్ల కాంగ్రెస్ మెట్రో రైలు వేసింది. భూముల విలువ పెంచుకునేందుకు ఔటర్ చుట్టూ కేసీఆర్ మెట్రో వేస్తున్నారు. పేదలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ మెట్రో వేస్తే…రియల్ వ్యాపారం కోసం మీరు మెట్రో వేస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అని సిగ్గు లేకుండా అడుగుతున్నవా? ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన నీ జ్ఞానం’’ అని రేవంత్ రెడ్డి కేసీఆర్పై ధ్వజమెత్తారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతి నిర్ణయంలో కేసీఆర్ ఉన్నారని, అప్పుడు జరిగింది పాపమే అయితే…ఆ పాపంలో ఆయనకు భాగం ఉన్నట్టే కదా.. ఆనాటి పాపాలకు కేసీఆర్ కారణం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో, 2011లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది నీవు కాదా? అని కేసీఆర్ ను రేవంత్ నిలదీశారు. ‘‘కేసీఆర్కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా..50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధం 23 లక్షల కోట్లతో తెలంగాణలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చర్చిద్దాం..పెన్షన్ మొదలు పెట్టిందే కాంగ్రెస్.. రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంది కాంగ్రెస్..నిర్దిష్టమైన చర్చ జరిగేందుకు కేసీఆర్ ముందుకు రావాలి.
మూడు పంటలు అంటున్న కేసీఆర్ రైతు బంధు రెండు పంటలకే ఎందుకు వేస్తున్నారు? కేసీఆర్ తన తల్లిదండ్రుల పేర్లు తప్ప…ఏదీ నిజం చెప్పరు’’ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఎద్దేవా చేశారు.‘కేసీఆర్ నీ భవన్ గోడలపై రాసుకో…కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుంది. నాలుగువేల పెన్షన్ ఇస్తాం..కాంగ్రెస్ అంతా షబ్బీర్ అలీకి అండగా ఉండి కేసీఆర్ పని పడుతాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఐఆర్బీ నుంచి వొచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా…పది రోజులకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని..ప్రజలు నీళ్లలో మునిగి చనిపోయారు..కేటీఆర్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన సవాలును స్వీకరిస్తున్నామన్నారు. 119 అభ్యర్థులతో పైసలు, మందు పంచమని ఓట్టు వేపిస్తా, మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. యాదాద్రికి రమ్మంటారా?..నాంపల్లి దర్గాకి రమ్మంటారా?.. మెదక్ చర్చికి వెళ్దామా? అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేయమన్నా మేం సిద్ధమే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న సూర్యాపేట సభలో శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారు. అమరవీరుల కుటుంబానికి కనీస గౌరవం ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ కోసం కవిత దిల్లీలో ధర్నా చేయడం కాదు.. ఇక్కడ కేసీఆర్ను ప్రశ్నించాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకులా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని పారేశారు. మోసం చేసిన కమ్యూనిష్టులు కేసీఆర్ పై తిరుగుబాటు చేయాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.
భారీ చేరికలు
బాన్సువాడ, వర్ధన్నపేట, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన జిల్లా డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాగారెడ్డి, ముథోల్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు సాయినాథ్, రాజు, ఎంపీటీసీ దేవదాస్, ర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలానికి చెందిన పలువురు వార్డు సభ్యులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ గ్రామాన తిరగండి… ప్రతీ తలుపు తట్టండి బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు 5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. కాంగ్రెస్ వస్తుంది… రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాంరూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు.