మణుగూరు: బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాసులు ఇప్పుడు దొరగారి దొడ్లో గడ్డి తింటున్నారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మణుగూరులో అయన మాట్లాడారు. ఇక్కడ ప్రధానమైన సమస్య పొడుభూముల సమస్య. భూమి కన్నతల్లి లాంటిది.. మనకు జీవనాధారం. పోడు భూములకు పట్టాలు ఇస్తానని కేసీఆర్ చెప్పి తొమ్మిదేళ్లయినా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు.
పోడు భూములకు పట్టాలిస్తామని కాంగ్రెస్ చెప్పగానే కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టింది. అందుకే అసెంబ్లీలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిండు. తొమ్మిదేళ్లలో చేయలేనోడు తొమ్మిది నెలల్లో చేస్తాడన్న నమ్మకం లేదు. అందుకే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి పోడు భూములకు పట్టాలు తెచ్చుకుందాం. గోదావరి ముంపు బాధితులకు ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు సాయం అందిస్తాం. లక్షా 50వేల కార్మికుల కష్టాలకు కారణం కేసీఆర్ కాదా? ఈ ప్రాంతం ఉద్యమాలకు పోరాటాలకు పుట్టినిల్లు. ఇక్కడి ప్రజల్ని మోసం చేస్తే కేసీఆర్ ను రాజకీయంగా పాతరేస్తారని అన్నారు. మోదీ డబుల్ ఇంజన్ సర్కారు అంటే.. డీజిల్, పెట్రోల్ ధరలను డబుల్ చేయడమా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 500లకే సిలిండర్ ఇచ్చి పేదలను ఆదుకుంటాం. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన సన్నాసికి సవాల్ విరుతున్నానని అన్నారు.
పినపాకలో ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో అక్కడే బీఆరెస్ ఓట్లు అడగాలి. ఈ సవాలుకు సిద్ధమా ? ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తాం. ఆపన్న హస్తం.. పేదలకు అభయ హస్తం ఇస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మార్చుకుంటారా ? పిర్యాదు చేసిన మా పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడతారా ? కబ్జా చేసిన మా పార్టీ ఆఫీసును తిరిగి ఇచ్చేయండి. లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో… ఇదే పోలీసులతో రేగా కాంతారావుకు బేడీలు వేయించి మా పార్టీ ఆఫీసు ముందు నుంచి తీసుకెళ్లేలా చేస్తానని హెచ్చరించారు.
కాళ్లు విరుగుతాయ్ అని మాట్లాడుతున్న కేసీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. కార్యకర్తలతో వస్తా… ఎవరి కాళ్లు విరుగుతాయో తేల్చుకుందాం. మన్మోహన్ సింగ్ ను పొగిడి మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవ్వాలని కేసీఆర్ చూస్తుండు.ఇ న్నాళ్లు బీజేపీ చంకలో ఉన్న కేసీఆర్ ను కాంగ్రెస్ నమ్మే ప్రసక్తే లేదు. కేసీర్ కు కాలం చెల్లింది.. ఆయన రద్దైన వెయ్యి నోటు లాంటివాడు. కాలనాగునైనా కౌగిలించుకుంటాం కానీ కేసీఆర్ ను నమ్మం… కల్వకుంట్ల కుటుంబంతో కలవం. అటు మోదీ, ఇటు కేడీ తెలంగాణ కష్టాలు తీర్చరు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ కు మాత్రమే ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ.. టీఆరెస్ దొరల పార్టీ. కాంగ్రెస్ పేదలు, దళిత, గిరిజన, మైనారిటీల పార్టీ. దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేసే దమ్ము బీఆరెస్ కు ఉందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయని అన్నారు.