సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
హైదరాబాద్ : గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ జోషీ హైదరాబాద్కు భారీగా గుట్కా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా ఇటీవల హైదరాబాద్లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకటంతో సెలబ్రిటీలపై పోలీసులు నిఘా పెంచారు. అయితే ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలు అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి, పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం.
ఇక హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని భోగట్టా. సచిన్ జోషి ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో తాజాగా సచిన్ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.